Tuesday, December 24, 2019

Hemant meets Babulal, JVM(P) announces unconditional support

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్: జేవీఎం బేషరతు మద్దతు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన మహాఘట్ బంధన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అయిదో సీఎంగా హేమంత్ సోరెన్ నియమితులు కానున్నారు. మంగళవారం ఆయన మాజీ ముఖ్యమంత్రి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీని రాంచీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో మరాండీ ధన్వార్ నుంచి గెలుపొందగా జేవీఎం పార్టీ మొత్తం 3 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా మహాఘట్ బంధన్ లోని ఝార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 తదితర పార్టీల మద్దతుతో హేమంత్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. తాజాగా జేవీఎం(పి) బేషరతుగా మద్దతు తెలిపింది. హేమంత్ తండ్రి శిబుసోరెన్ ఝార్ఖండ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు సోరెన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1994లో శిబు సోరెన్ ప్రయివేట్ సెక్రటరీ శశినాథ్ ఝా హత్యకు గురయ్యారు. అందులో ఆయన పాత్ర నిరూపణ కావడంతో 2006లో అరెస్టయి  జీవితఖైదు అనుభవిస్తున్నారు.
బీజేపీ ఓటమితో కాంగ్రెస్ సంబరం
జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి మెజారిటీ మార్కును దాటి హేమంత్ సోరెన్‌ ముఖ్యమంత్రిగా తమ కూటమి అధికారంలోకి రానుండడంతో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది. ఝార్ఖండ్ ఏఐసీసీ కమిటీ ఇన్ ఛార్జీ  ఆర్‌పీఎన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలు, జీవనోపాధిని ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తి ఎన్నికలలో పోరాడి తాము అధికారానికి వచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజల దృష్టిని ప్రాథమిక సమస్యల నుంచి మళ్లించడానికి యత్నించి చివరకు ఓటమి పాలయ్యారని చెప్పారు.ఫలితాలు బీజేపీ అహంకార, అవినీతిమయ పాలనకు చెంపపెట్టుగా రాష్ట్ర ఎన్నికల కాంగ్రెస్ సమన్వయకర్త అజయ్ శర్మ పేర్కొన్నారు.

Friday, December 20, 2019

Unnao rape case life imprisonment for Ex- BJP MLA Kuldeep Singh Sengar

ఉన్నావ్ రేప్ కేసు దోషి ఎమ్మెల్యే సెంగర్ కు జీవితఖైదు
·   రూ.25 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాలిక అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ నాయకుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు జీవితఖైదు శిక్ష ఖరారయింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ ప్రాణ రక్షణకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తగిన ఏర్పాట్లు చేయాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఉద్యోగం ఆశ చూపి ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 2017లో బాధితురాలు మైనర్ గా ఉండగా ఈ దారుణం జరిగింది. దాంతో ఎమ్మెల్యే సహా అతని సోదరుడిపైన బాలిక అపహరణ, నిర్బంధం, లైంగిక దాడి, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ బాధిత బాలిక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంప్ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం కూడా బాలిక ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టి నిందితులు హత్యా యత్నం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ బాధిత కుటుంబానికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. అదే విధంగా కేసు విచారణను యూపీ న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. ఎమ్మెల్యే సెంగర్ నేరానికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాలను సీబీఐ న్యాయస్థానానికి అందించడంతో నేడు శిక్ష ఖరారయింది.

Monday, December 16, 2019

On Dharna Against Jamia Crackdown, Priyanka Gandhi Says 'It's Attack on India's Soul'

ఇండియా గేట్ వద్ద ప్రియాంకగాంధీ `నిశ్శబ్ద నిరసన`

పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ సహా దేశంలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు వ్యక్తం చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ సంఘీభావం తెలిపారు. సోమవారం ఆమె కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులతో కలిసి రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 4కు ఆమె ధర్నాకు కూర్చున్నారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని `నాశనం` చేయడానికే దీన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందని ఆమె విరుచుకుపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే వారిపై దాడికి దిగడం `భారత ఆత్మపై దాడి`గా ప్రియాంక పేర్కొన్నారు. ఆదివారం జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియంతగా మారుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడతారని ప్రియాంక గాంధీ అన్నారు. ఆర్థికవ్యవస్థ, మహిళలు, విద్యార్థులపై మోదీ సర్కారు వరుసగా దాడికి పాల్పడుతోందని విమర్శించారు. హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రధాని చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ అజాద్ తీవ్రంగా ఖండించారు. జామియాలో పోలీసు ప్రవేశానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై కేసు బుక్ చేయాలని సీపీఐ ప్రధానకార్యదర్శి రాజా కోరారు. ఈ ఘటన బాధ్యులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచురీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, ఆర్జేడీ నేత మనోజ్, ఎస్పీ నాయకుడు జావేద్ అలీఖాన్, జేడీ(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొని విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండించారు.

Tuesday, December 10, 2019

Group of youth sit outside Smriti Irani`s house to meet her in support of DCW chief`s movement

స్మృతి ఇరానీ ఇంటి ఎదుట నిరసన జ్వాల
ఢిల్లీ మహిళా కమిషన్ (డి.సి.డబ్ల్యు) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ కు మద్దతు తెలుపుతూ నగర యువత మంగళవారం కదం తొక్కారు. కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి  స్మృతి ఇరానీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువతీయువకులు ధర్నాకు దిగారు. ఆమెను కలవాలని పట్టుబట్టారు. గేట్ల వద్ద మోహరించిన సెక్యూరిటీ సిబ్బందితో  పెద్ద ఎత్తున  వాగ్వాదానికి దిగారు. రేపిస్టులకు ఆర్నెల్ల లోపు ఉరిశిక్ష విధించాలని గత ఎనిమిది రోజులుగా స్వాతి నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నినాదాలు చేశారు. `అత్యాచారదోషుల్ని ఉరి తీయాలి`.. `ఆరునెలల్లో మరణశిక్ష విధించాలి` అని ఖాళీ పళ్లాలపై రాసిన నినాదాల్ని ప్రదర్శించారు. రేపిస్టుల్ని సత్వరం ఉరికంబం ఎక్కించాలని నిరశన తెల్పుతున్న స్వాతి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. మంత్రి ఇరానీ ఇంట్లో లేరని భద్రత సిబ్బంది వారిస్తున్నా ఆందోళనకారులు పట్టువీడకుండా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలువురు ఆందోళనకారుల్ని అక్కడ నుంచి బస్సుల్లో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా మరికొందరు ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో మంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఈ విషయాన్ని సత్వరం ఆమెకు చేరవేస్తామని హామీ ఇచ్చి వారికి నచ్చచెప్పారు. దాంతో శాంతించిన నిరసనకారులు ధర్నాను విరమించారు.