Friday, November 1, 2019

Rajnath Singh pays tribute to former PM Shastri


నిరుపమాన యోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి: రాజ్ నాథ్
పాకిస్థాన్ తో యుద్ధ సమయంలో భారత్ ను సమైక్యంగా పటిష్టంగా నిలిపిన యోధుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్లాఘించారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ లో పర్యటిస్తున్న రక్షణమంత్రి ఈ సందర్భంగా శుక్రవారం శాస్త్రి స్ట్రీట్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాక్ ల యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ పిలుపు ఓ ప్రభంజనంలా యావత్ దేశాన్ని కదిలించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. యుద్ధానంతరం 1966 లో యూఎస్ఎస్ఆర్ మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ ల మధ్య తాష్కెంట్ లో ఒప్పందం కుదిరింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 11న శాస్త్రీజీ ఆకస్మికంగా కన్నుమూశారు. శాస్త్రీజీ జీవనశైలి, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమని రాజ్ నాథ్ కొనియాడారు. శాస్త్రీజీ స్మృత్యర్థం నిర్మించిన పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భారత్ పైన, హిందీ భాష పట్ల కనబర్చిన ప్రేమకు రక్షణ మంత్రి ముగ్ధులయ్యారు. ఈనెల 2,3 తేదీల్లో జరగనున్న ప్రభుత్వాధినేతల (సీహెచ్జీ) సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. అదేవిధంగా భారత్, ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల పైన చర్చలు జరుపుతారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) కీలక సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొననున్నారు.

Thursday, October 31, 2019

President, HM Amith shah pay floral tributes to Sardar patel on his birth anniversary at Patel Chowk


సర్దార్ పటేల్ పాదాల చెంత 370 రద్దు నిర్ణయం: మోదీ
మహానేత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 114వ జయంతిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘనంగా  నివాళులర్పించారు. గురువారం పటేల్ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లు  దివంగత నేత పటేల్ సేవల్ని శ్లాఘించి పుష్పాంజలి ఘటించారు.  స్వాతంత్ర్యానికి పూర్వం వేర్వేరుగా ఉన్న వందలాది సంస్థానాల్ని దేశంలో విలీనం చేసి అఖండ భారత సంస్థాపనకు పటేల్ సాగించిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక 2014 నుంచి సర్దార్ పటేల్ జయంతిని ఏక్తా దివస్ (ఐక్యత, సమగ్రత దినోత్సవం) గా పాటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని పటేల్ కు అంకితమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మహానేత పాదాల చెంత ఈ నిర్ణయాన్ని ఉంచుతున్నానంటూ మోదీ పుష్పాంజలి ఘటించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (కెవాడియా-గుజరాత్) వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ శతాబ్దాలకు పూర్వం దేశాన్ని చాణక్యుడు ఏకతాటిపై నిలిపారని మళ్లీ ఆ ఘనతను సర్దార్ పటేల్ సొంతం చేసుకున్నారన్నారు.

Tuesday, October 29, 2019

ISIS leader abu bakr al Baghdadi died in an operation by American special forces


ఆత్మాహుతికి ముందు వలవలా ఏడ్చిన ఐసిస్ ఉగ్రనేత బాగ్దాదీ
కరడుగట్టిన ఉగ్రవాది సైతం మరణపు అంచులకు చేరినప్పుడు విలవిల్లాడక తప్పదు. ఇదే విషయం నరరూప రాక్షసులుగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ (48) చివరి క్షణాల్లో రుజువయింది. టర్కీకి సమీపంలోని తూర్పు సిరియాకు చెందిన బరిషా గ్రామంలో ఓ గుహలో దాగిన బాగ్దాదీని అమెరికా ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. యుద్ధ తంత్రంలో ఆరితేరిన శునకాలతో సరికొత్తగా అమెరికా సేనలు బాగ్దాదీ పైకి దాడికి ఉపక్రమించాయి. లొంగిపోవాల్సిందిగా అతణ్ని హెచ్చరించాయి. చుట్టూ సేనలు అరివీరభయంకరమైన పులుల్లాంటి జాగిలాలు లంఘిస్తూ మీదకు ఉరుకుతుంటే అంతటి భయంకరమైన ఉగ్రవాది బాగ్దాదీ సైతం పరుగులు పెడుతూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మాటువేసి బాగ్దాదీ జాడ కనుగొన్న అమెరికా సంకీర్ణ దళాలు రెండు వారాలు క్రితమే పక్కా ప్రాణాళికతో `ఆపరేషన్ కైల ముల్లర్` కు శ్రీకారం చుట్టాయి. ఈ మొత్తం ఆపరేషన్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి లైవ్ లో వీక్షించారు. తప్పించుకోలేని పరిస్థితుల్లో బాగ్దాదీ తనను తను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు సహా బాగ్దాదీ తునాతునకలై పోయాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అమెరికా భద్రతా బలగాలు బాగ్దాదీ మృతిని ధ్రువీకరించాయి. పాకిస్థాన్ లోని అబోథాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సీషెల్స్ కమెండోలు హతమార్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబమా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన చందంగానే తాజాగా బాగ్దాదీని మట్టుబెట్టే దృశ్యాల్ని ట్రంప్ లైవ్ ద్వారా వీక్షించారు. బాగ్దాదీ హతమయ్యాడనే వార్తలు ధ్రువీకరణయ్యాక ఆ విషయాల్ని ట్రంప్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. సేవాసంస్థలో భాగస్వామి అయిన అమెరికాకు చెందిన కైల ముల్లర్ వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించారు. బాగ్దాదీ ఆమెపై తొలుత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు ఉగ్రవాదుల చెరలో మగ్గిన ముల్లర్ అనంతరం మరణించినట్లు అమెరికా పేర్కొంది. ఎన్నాళ్ల నుంచో ఐసిస్ పీచమణిచేందుకు కంకణం కట్టుకున్న అమెరికా ఆదివారం `ఆపరేషన్ కైలముల్లర్` ద్వారా ఆ సంస్థ అధినేతను అంతమొందించి మరోసారి తన సత్తా చాటింది.

Monday, October 28, 2019

Unemployment fuels unrest in Arab states: IMF


గల్ఫ్ దేశాల్లో అశాంతిని రగిలిస్తోన్న నిరుద్యోగిత:ఐఎంఎఫ్
గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగా అశాంతి నెలకొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. సోమవారం ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్ని కల్గి ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ వరకు పరిణామ క్రమాల్ని అనుసరించి ఈ మేరకు ఐఎంఎఫ్ నివేదిక రూపొందించింది. ఈ దేశాల్లో అభివృద్ధి సూచి తక్కువగా ఉండడానికి కారణం నిరుద్యోగితేనని ఐఎంఎఫ్ మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏసియా డైరెక్టర్ జిహద్ అజర్ తెలిపారు. అభివృద్ధి సూచీలో పెంపుదల నమోదు కావడానికి ఈ దేశాలు తొలుత నిరుద్యోగిత నివారణ చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. ఇక్కడ యువత నిరుద్యోగిత శాతం 25 నుంచి 30 వరకు ఉన్నట్లు చెప్పారు. ఈ అవరోధాన్ని అధిగమిస్తే అభివృద్ధిలో 1-2 శాతం పెంపు సాధ్యమౌతుందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగానే అశాంతి, అలజడి వాతావరణాలు నెలకొంటున్నాయని ఐఎంఎఫ్ విశదీకరించింది. ఇక్కడ నిరుద్యోగిత 11 శాతం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, యువత ఉద్యోగాలకు దూరమయ్యారంది. 2018 నాటికి 18 శాతం మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, యెమన్, లిబియాల్లో అంతర్యుద్ధాలూ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినట్లు ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ప్రజలపై రుణభారం 85 శాతానికి మించినట్లు తెలిపింది. లెబనాన్, సూడాన్ ల్లో అయితే రుణభార శాతం 150కి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామిక్ దేశాల్లో గతంలో జీడీపీ 9.5గా నమోదు కాగా 2018 నాటికి -4.8గా తిరోగమనం బాట పట్టినట్లు ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యం, చమురు ధరల అస్థిరత, రాజకీయ పరిస్థితులు కూడా తాజా దుస్థితికి కారణాలుగా ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.