Thursday, October 3, 2019

Sarad Pawar kicks off poll campaign in Junnar; hits out at BJP


ప్రచార శంఖం పూరించిన శరద్ పవార్
మహారాష్ట్ర దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించారు. గురువారం ఆయన తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి గెలుపు కోసం జునార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా వారిని సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరికిస్తున్నారని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలు పాలు చేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించడమే కాక  రాజకీయ మైలేజ్ వచ్చే అంశాలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పవార్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ పాలన ఘోరంగా ఉందని ఫడ్నవిస్ జమానాలో శాంతిభద్రతల పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరుకుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను అనాలోచితంగా రద్దు చేయడం అనంతరం జీఎస్టీ కొరడా ఝళిపించడంతో వ్యాపార, వాణిజ్యరంగాలు దెబ్బతిన్నాయని దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పవార్ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత మాట అటుంచి దేశంలోని ప్రతి వ్యక్తి నోట్ల కోసం సతమతమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ పోరాడి గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.  

Wednesday, October 2, 2019

Gandhi jayanthi: Air India paints Gandhi portrait onits aircraft


ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై గాంధీజీ బొమ్మ
మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తన విమానంపై బాపూజీ బొమ్మను చిత్రీకరించి నడుపుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగంలో ఉన్న గాంధీజీ పెయింటింగ్ ప్రయాణికుల్ని ఆకట్టుకుంది. సుమారు 11 అడుగుల పొడవు, 4.9 అడుగుల వెడల్పుతో గాంధీజీ పెయింటింగ్ ను ఈ ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై అందంగా చిత్రీకరించారు. ఎయిర్ ఇండియా లోగో కింద చిత్రీకరించిన గాంధీజీ పెయింటింగ్ చూపరుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్ లైన్స్ హౌస్ మెయింటెనెన్స్ సిబ్బంది ఈ బొమ్మ చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశారు. ఇదిలావుండగా సెంట్రల్ రైల్వే జోన్ (ముంబయి ప్రధాన కేంద్రం) లోని డీజిల్ రైల్వే ఇంజన్లపై ఇదేవిధంగా మహాత్ముని బొమ్మను చిత్రీకరించారు. 22 లోకోమోటివ్ ఇంజన్లకు ఒకవైపున గాంధీ బొమ్మలను పెయింటింగ్ చేశారు. జాతీయ పతాకం పై అందంగా బాపూజీ బొమ్మను చిత్రీకరించి ఆ ఇంజన్లతో కూడిన రైళ్లను సెంట్రల్ రైల్వే జోన్లో ఈరోజు నడుపుతున్నారు.

BJP should first pursue path of truth and then talk about Mahatma Gandhi: Priyanka


బీజేపీ సత్యం చెప్పి.. అప్పుడు గాంధీజీ గురించి మాట్లాడాలి:ప్రియాంక
భారతీయ జనతా పార్టీ ముందు సత్యం పలకడం అలవాటు చేసుకుని ఆ తర్వాతే మహాత్మాగాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొనే ముందు విలేకర్లతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో తొలుత పాటించాల్సింది నిజం చెప్పడం.. ఆ అంశాన్ని బీజేపీ గుర్తించి ఆచరించాలని ఆ తర్వాతే ఆయన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మౌన పాదయాత్రతో తన బలాన్ని ప్రదర్శించేందుకు సమాయత్తమయింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై అత్యాచారం జరిపారని ఆరోపించిన న్యాయ విద్యార్థికి మద్దతుగా ర్యాలీకి యత్నించిన సుమారు 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలను సోమవారం యూపీ సర్కారు అరెస్ట్ చేసింది. బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమైన దశలో పోలీసులు వారిని నిర్బంధించారు. ఈ అరెస్టుల్ని ప్రియాంక తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో `మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయి.. వాటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి గొంతెత్తిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.` యూపీ సర్కార్ నిరంకుశ వైఖరిపై తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రియాంక హెచ్చరించారు.

Tuesday, October 1, 2019

Kejriwal greets president Ramnath Kovind on his birthday


రాష్ట్రపతి కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశంలో పలువురు నాయకులు మంగళవారం ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిజీకి జన్మదిన శుభాకాంక్షలు..దేశ సేవలో అంకితమయ్యేందుకు ఆయనను దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి..అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జన్మదినం రోజున రాష్ట్రపతి వారణాసిలో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో ఆయన 1 అక్టోబర్ 1945లో జన్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన కోవింద్ యునైటెడ్ ప్రొగెసివ్ అలయెన్స్ (యూపీఏ) అభ్యర్థి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2017 జులై25 న ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరిన తర్వాత బిహార్ గవర్నర్ గా పనిచేశారు.