Monday, August 26, 2019

Alongside Trump, PM Modi rejects any scope for third party mediation on Kashmir


మోదీపై జోక్ పేల్చిన ట్రంప్
భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరదాగా ఆటపట్టించారు. ఫ్రాన్స్ పట్టణం బియర్రిట్జ్ లో జరుగుతున్న జి-7 సమావేశాలకు హాజరైన సందర్భంగా మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ జోక్ పేల్చారు. మోదీ ఇంగ్లిష్ చక్కగా మాట్లాడతారు.. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో మాట్లాడరంటూ ట్రంప్ చమత్కరించారు. అందుకు మోదీ పెద్దగా నవ్వేస్తూ తన చేతుల్లోకి ట్రంప్ చేయిని తీసుకుని చరిచారు. దాంతో అక్కడున్న వారందరిలో నవ్వులు విరబూశాయి.
కశ్మీర్ సమస్యపై మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టం
దీర్ఘకాల అపరిష్కృత సమస్యగా ఉన్న కశ్మీర్ వ్యవహారాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని ట్రంప్ తో భేటీ సందర్భంగా మోదీ తేల్చిచెప్పారు. ఈ సమస్య పరిష్కారంలో మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టబోమన్నారు.  ట్రంప్ తో కలిసి మోదీ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ను కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ పాతపాటే పాడారు. అందుకు బదులుగా ట్రంప్ కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. స్పందించిన అమెరికా కాంగ్రెస్ భారత్, పాక్ ల ద్వైపాక్షిక చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాలని వివాదం రేగకుండా సముచిత ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో మోదీ కశ్మీర్ సమస్యపై మూడో దేశం జోక్యం అవసరం లేదని నర్మగర్భంగా చెప్పారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం పాక్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి యత్నించి భంగపడింది. ఆ క్రమంలో అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి మరీ పాక్ ప్రధాని నానాయాగి చేశారు. దాంతో మోదీ సైతం ఇటీవల ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి కశ్మీర్ భారత అంతర్భాగమని అందులో తాము దేశీయంగా చేపట్టిన చర్యల్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన ట్రంప్ వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసి భారత్ ను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. తాజా భేటీలో ట్రంప్ తో మోదీ మాట్లాడుతూ పాక్ ప్రధానితో కొంతకాలం క్రితం టెలిఫోన్ లో తను సంభాషించినట్లు తెలిపారు. పాక్ లో సమస్యల్ని ఇమ్రాన్ తనతో ఏకరువు పెట్టారన్నారు. ఆ దేశంలోని ప్రజల బాగోగులకు సంబంధించి కూడా భారత్ చేయూత అందిస్తుందని ఇమ్రాన్ కు చెప్పినట్లు మోదీ తెలిపారు.

Sunday, August 25, 2019

Muslims cremate Hindu friend in Assam village


సోదర హిందువుకి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు
అసోంలో మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. కామరూప్ జిల్లా హిందూముస్లింల సఖ్యతకు అద్దం పట్టింది. ఆదివారం కండికర్ గ్రామంలో ఓ వృద్ధ హిందువుకి దహనసంస్కారాల్ని ముస్లిం సోదరులు నిర్వహించిన ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల రాజ్ కుమార్ గౌర్ శనివారం మరణించారు. దాంతో ఏళ్ల తరబడి అక్కడ జీవనం సాగిస్తున్న ఆయనకు స్థానిక ముస్లింలే అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అసోం వలస వచ్చిన రాజ్ కుమార్ కుటుంబం తొలుత రైల్వే కార్టర్స్ లో నివాసం ఉండేవారు. 1990లో తండ్రి మరణించడంతో రాజ్ కుమార్ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో సద్దాం హుస్సేన్ అనే ముస్లిం తన ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పించారు. రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. వారిద్దరూ ముస్లిం యువకుల్నే పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ కూడా దశాబ్దాలుగా ముస్లింలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ముస్లింల పండుగలు, పెళ్లి వేడుకల్లో రాజ్ కుమార్ పాల్గొంటూ వాళ్ల బంధువుగా మెలిగారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడంతో కండికర్ గ్రామ ముస్లింలే దహన సంస్కారాలకు పూనుకున్నారు. అందుకు అవసరమయ్యే సామగ్రి తదితరాల గురించి తమను అడిగి తెలుసుకున్నట్లు పొరుగున గల ఉపెన్ దాస్ గ్రామవాసులు తెలిపారు. ఒక బ్రాహ్మణుడ్ని ఏర్పాటు చేసుకుని వారు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఇటీవల ఎన్.ఆర్.సి. పున: నమోదు (రీ వెరిఫికేషన్)కు అసోం పశ్చిమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలకు శివసాగర్, చారయిడియో జిల్లాల హిందూ యువకులు ఆశ్రయం కల్పించి ఆదరించిన సంగతి తెలిసిందే.

Saturday, August 24, 2019

Several Leaders Says Deeply Saddened to Hear the Death of Arun Jaitley


అరుణ్ జైట్లీ అస్తమయం: పలువురు నాయకుల నివాళి
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.30 కు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోది, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియగానే ఆయన స్వగృహానికి చేరుకున్న రాష్ట్రపతి దివంగత నేతకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడు పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షా సమాచారం అందిన వెంటనే అరుణ్ జైట్లీ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అరుణ్ జైట్లీ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆగస్ట్ 9న ఆయన అస్వస్థకు గురై ఎయిమ్స్ లో చేరారు. అరుదైన కేన్సర్ తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ రెండు వారాల చికిత్స అనంతరం కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి లోనూ ఆయన అమెరికా వెళ్లి కొంతకాలం చికిత్స పొందారు. వాజ్ పేయి ప్రభుత్వంలో న్యాయశాఖ, సమాచార ప్రసారశాఖల్ని నిర్వహించారు. స్వతహాగా న్యాయవాది అయిన ఆయన సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల్లో కేసులు వాదించారు. అరుణ్ జైట్లీ పాత్రికేయులతో సత్సంబంధాలు నెరపిన నేత. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన అడిషినల్ సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు వహించారు. ప్రధాని మోదితో ఆయనకు మూడు దశాబ్దాల అనుబంధముంది. మోది తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఆయన కేబినెట్ లో రక్షణ, ఆర్థిక శాఖల్ని చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో అరుణ్ జైట్లీ తరఫున పీయూష్ గోయల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ మరణించిన నెలలోనే మరో సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటు. ఆయన అంత్యక్రియల్ని ఆదివారం ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో నిర్వహించనున్నారు.

Friday, August 23, 2019

6-year-old girl raped by 3 schoolmates in Chhattisgarh


ఆరేళ్ల బాలికపై అత్యాచారం ముగ్గురు బాలురపై కేసు నమోదు
ఛత్తీస్ గఢ్  రాజధాని రాయ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆగస్ట్ 20 మంగళవారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. కమట్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక ఒకటో తరగతి చదువుతోంది.  బాలికను పాఠశాల బాత్రూమ్ లోకి తీసుకెళ్లిన ముగ్గురు బాలురు లైంగికంగా వేధించారు. వీరిలో ఒక బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి  ఒడిగట్టాడు. బాలురు అందరూ 10 ఏళ్ల వారే కావడం గమనార్హం. ఈ ఘటనను గమనించిన ఉపాధ్యాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకువచ్చారు. బాధిత బాలిక సహా ముగ్గురు  బాలుర్ని ఆయన వద్దకు తరలించారు. తర్వాత తల్లిదండ్రుల్నిపిలిపించి బాలికను అప్పగించారు. గురువారం రాత్రి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణానికి పాల్పడిన ముగ్గురు బాలురపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో-ఐపీసీ సెక్షన్ 4) కింద కేసులు నమోదు చేశారు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఘటన వివరాల్ని నమోదు చేశారు. బాలికను లైంగికంగా వేధించినందుకు గాను ఇద్దరిపై సెక్షన్-354/ఎ కింద, అత్యాచారం చేసిన బాలుడిపై సెక్షన్-376 ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే ఇంకా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోలేదని సమాచారం.