Monday, August 12, 2019

Vikram lander will land on moon as tribute to Vikram Sarabhai from crores of Indians:PM Modi


చందమామపై విక్రమ్ ల్యాండర్.. అదే భారత అంతరిక్ష పితామహునికి ఘన నివాళి:ప్రధాని మోది
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక పార్శ్వమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుండడమే భారత అంతరిక్ష ప్రయోగ పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ కి నిజమైన నివాళి అని ప్రధాని మోది పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోది వీడియో సందేశమిస్తూ ఆయన సేవల్ని స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపకుడిగా విక్రమ్ సారాభాయ్ సేవలు చిరస్మరణీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా భారతీయ సంస్కృతి, సంస్కృత భాషా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. పిల్లల్లో ఆధునిక శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో పాటు, భారతీయ సంస్కృతి విలువల్ని పెంపొందించడం, సంస్కృత భాషా అభిలాషను ప్రోత్సహించేందుకు పాటు పడ్డారని ప్రధాని చెప్పారు. డాక్టర్ హోమీ బాబా మరణంతో యావత్ ప్రపంచం శాస్త్రసాంకేత విజ్ఞాన రంగంలో ఎదుర్కొంటున్న లోటును విక్రమ్ సారాభాయ్ తీర్చారన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ వ్యాప్తంగా నీరాజనాలందుకుంటున్న ఇస్రోను నెలకొల్పిన విక్రమ్ సారాభాయ్ `భారతమాతకు నిజమైన పుత్రుడు` అని చైర్మన్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ఆయన ఓ అద్భుతమైన సంస్థకు అంకురార్పణ చేశారని కొనియాడారు. భౌతికశాస్త్రం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అణుశక్తి రంగాల్లో విక్రమ్ సారాభాయ్ సేవలు నిరుపమానమన్నారు.
విక్రమ్ సారాభాయ్ ఆగస్ట్ 12, 1919లో అహ్మదాబాద్ (ఉమ్మడి మహారాష్ట్ర) లో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1942లో ఆయన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు. ఇస్రోతో పాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఎ) సంస్థలను నెలకొల్పారు. భారత అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా) కి 1966-1971 వరకు చైర్మన్ గా వ్యవహరించారు. 1966లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. 1971లో తన 52వ ఏట తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ పరమపదించారు. మరణానంతరం 1972లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.   

Sunday, August 11, 2019

Abrogation of 370 is the need of the hour: Vice President venkaiah Naidu


జమ్ముకశ్మీర్ లో 370 అధికరణం రద్దు అనివార్యం: ఉపరాష్ట్రపతి
దేశ భద్రత, సమగ్రతల కోణంలో ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అత్యవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం చెన్నైలో ఆయన తన రెండేళ్ల పదవీకాలంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. 370 అధికరణం రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభించినందున ఇప్పుడు ఆ విషయంపై తను స్వేచ్ఛగా మాట్లాడుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ తనను జమ్ముకశ్మీర్ ను చూశారా? అని ప్రశ్నించినట్లు ఉపరాష్ట్రపతి చెప్పారు. మన ముఖంలో ఉండే రెండు కళ్లు కూడా ఒకదాన్ని మరొకటి చూడలేవు..కానీ ఒక కంటికి బాధ కల్గితే రెండో కంట్లోనూ నీరు ఉబికి వస్తుందని వెంకయ్య అన్నారు. అదే విధంగా భారత జాతి ప్రయోజనాల రీత్యా దేశమంతా ఏకరీతిగా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలన్న తేడా లేకుండా సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలన్నారు. జమ్ముకశ్మీర్ లో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలై ప్రగతి నెలకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు వల్ల ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. తమ పార్టీకి రాజ్యసభలో కనీస మెజార్టీ లేదని.. 370 ఆర్టికల్ రద్దు బిల్లును తొలుత ఆ సభలోనే ప్రవేశపెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు నాటి పరిస్థితులు నెలకొంటాయేమోనన్న చిన్న సందేహం కల్గిందన్నారు. అయితే పెద్దల సభలో బిల్లు సజావుగా ఆమోదం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అపొలో హాస్పిటల్స్ చైర్మన్ పి.సి.రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.కస్తూరి రంగన్, వి.ఐ.టి. వ్యవస్థాపకులు, చాన్స్ లర్ జి.విశ్వనాథన్ తదితరులు ఉపరాష్ట్రపతిని ఈ సందర్భంగా అభినందించారు.

Saturday, August 10, 2019

Tens of thousands join Moscow opposition rally after crackdown


నిష్పాక్షిక ఎన్నికల కోసం రష్యాలో కదం తొక్కిన జనం
నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత రీతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ (ఓపెన్ రష్యా మూవ్ మెంట్) రష్యా రాజధాని మాస్కో లో పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగారు. మాస్కో స్క్వేర్ లో శనివారం సుమారు 40 వేల మంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ `పుతిన్ ఇప్పటికీ చెప్పిన అబద్ధాలు చాలించండి..మాకు ఓటు వేసే స్వేచ్ఛ కల్పించండి` అంటూ నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లగా అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న 66 ఏళ్ల పుతిన్ నేరుగా ప్రజల నిరసనల్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. తాజా ర్యాలీలో 20 వేల మంది వరకు హాజరుకావచ్చని పోలీసులు వేసిన అంచనా తప్పింది. 2012లో దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టడం ఇదే ప్రథమం. జులై 21న కూడా మాస్కో స్క్వేర్ లో పెద్ద ఎత్తున జనం ఆందోళనకు దిగారు.16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ రాజకీయ వివాదాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు. మాస్కోలో గల 1 కోటీ 50 లక్షల మందిని  ఆ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రజా పక్షం వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికారులు అంగీకరించకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. దాంతో వందల సంఖ్యలో నిరసనకారుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దేశమే ఒక ఖైదుగా పౌరులు బందీలుగా మారినట్లు ప్రస్తుత పరిణామాలు పరిణమించాయని ఓపెన్ రష్యా ఉద్యమ కర్త డిమిత్రి ఖోబోటోవ్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు చర్యల్ని ఖండిస్తూ తాజాగా ఈరోజు మళ్లీ ప్రజలు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ లో సిటీ ఆఫ్ పార్లమెంట్స్ (స్థానిక సంస్థలు) కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ వ్యతిరేకులైన పలువురు ప్రతిపక్ష నాయకుల్ని పోటీ చేయడానికి వీలులేకుండా జైళ్లకు తరలించారు. ఆందోళనకు దిగి చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు డిమిత్రి గుడ్ కోవ్ కు 30 రోజుల కారాగారం విధించారు. ఆయన భార్య వలెరియా గుడ్ కోవ్ శనివారం నిర్వహించిన మాస్కో ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి పౌరులకు అధికారంలో భాగస్వామ్యం వహించే హక్కు ఉందని కానీ అందుకు పాలకులు భీతిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.

Friday, August 9, 2019

Hong Kong protesters kick off three-day airport rally


హాంకాంగ్ లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య ఉద్యమం
చైనా ఏలుబడిలోకి వచ్చిన హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం మహోజ్వల రూపం దాల్చింది. శుక్రవారం చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి వేల సంఖ్యలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు చొచ్చుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. దేశంలో (చైనా ఆధీనంలో ఉన్న తమ ప్రాంతం-టెరిటరీ) ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కోరుతూ గత ఏప్రిల్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడ్రోజులు విమానాశ్రయాల ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమకాంక్షను వెలిబుచ్చడం ద్వారా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు విమానాశ్రయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. నిరసనకారులు ముఖ్యంగా యువత ఉద్యమాన్ని ముందుకు నడుపుతోంది. నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు ప్లకార్డులు, బేనర్లు చేతపట్టుకుని రహదారుల మీదుగా నినాదాలు చేసుకుంటూ చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి చొచ్చుకువచ్చారు. ఏప్రిల్ లో తొలిసారి ఈ విమానాశ్రయాన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇదేవిధంగా ముట్టడించారు. సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటూ ఉద్యమకారులు వందలు, వేల సంఖ్యలో విమానాశ్రయం ముట్టడి దిశగా ముందుకు కదిలారు. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుంచి చైనా ఏలుబడిలో వచ్చిన సంగతి తెలిసిందే. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమాన్ని శాంతింపజేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. నిరసనకారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం దిగరావడం ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమౌతుందన్నారు. వాస్తవానికి ఏప్రిల్ లో ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రజాస్వామ్య ఉద్యమం సెగ రేగింది. అనంతరం విద్యార్థులు, యువత చెంతకు చేరిన ఉద్యమం ప్రస్తుతం ఊపందుకుంది. 428 చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన హాంకాంగ్ జనాభా సుమారు 74 లక్షలు. ద్రవ్య వినిమయంలో హాంకాంగ్ డాలర్ ప్రపంచంలోనే 13 స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ప్రజల భాష కంటోనీస్ కాగా ప్రస్తుతం అధికార భాషలుగా మాండరీన్ (చైనీస్), ఇంగ్లిష్ చలామణి అవుతున్నాయి. బ్రిటన్ హయాంలో హాంకాంగ్ వలస ప్రాంతానికి `సిటీ ఆఫ్ విక్టోరియా` నగరం రాజధానిగా ఉండేది. ప్రసుత్తం హాంకాంగ్ టెరిటరీ రాజధాని బీజింగ్. తమర్ లో గల చట్ట సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) లో ప్రతినిధులు సమావేశమవుతుంటారు. బిల్లుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు రూపొందిస్తారు. ప్రాంతీయంగా చట్టాలు చేసే అధికారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే ఉంటుంది. హాంకాంగ్ లో 2016లో జరిగిన ఎన్నికల్లో 22 పార్టీలకు చెందిన సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. బీజింగ్ అనుకూల పార్టీల కూటమి, ప్రజాస్వామ్య ఉద్యమ పార్టీల కూటమి, స్థానిక ప్రయోజనాల పరిరక్షణ పార్టీల కూటమిగా ఈ 22 పార్టీల నుంచి మూడు గ్రూపులు ఏర్పడ్డాయి.