Sunday, June 2, 2019

venkaiah naidu asks people to study debate draft new education policy



పరిశోధనాత్మక విద్యా విధానం రావాలి: ఉపరాష్ట్రపతి
బస్తాలకొద్దీ పుస్తకాల్ని భుజాలకెత్తుకుని మోసుకెళ్లే విద్యావిధానంలో మార్పులు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఆదివారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐ.ఐ.పి.ఇ) ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సులో ఆయన పలు విలువైన సూచనలు చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయంతో విద్యా ప్రమాణాల పెంపు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పిల్లలకు తొలుత పుస్తకాల సంచి బరువును తగ్గించాలన్నారు. ఆటపాటలతో పాటు విలువలు, సాంకేతిక, చారిత్రక, తార్కిక ఆలోచనా ధోరణిని విద్యార్థులకు అలవర్చాలన్నారు. మెరుగైన విద్యావిధానం ద్వారా ఉత్తమ శ్రేణి ఉద్యోగార్థులు మన ముందుకు వస్తారని అందుకు పరిశ్రమలు, సంస్థలు విద్యా సంస్థలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన తోడ్పాటును అందించాల్సి ఉంటుందన్నారు. కొంగొత్త ఆవిష్కరణలకు విద్యార్థుల స్థాయి నుంచే పరిశోధనలు జరగాలని అందుకు పరిశ్రమలు మరింత ముందడుగు వేసి విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. వృత్తి విద్యా సంస్థల నుంచి చాలా మంది విద్యార్థులు తగిన ఉద్యోగ నైపుణ్యాలు లేకుండానే బయటకు వస్తున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అభిరుచి, సామర్థ్యం, నైపుణ్యం అవసరమని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కాదలచిన వారికి ఇవన్నీ ముఖ్యమని చెప్పారు. విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు జీవితానికి అవసరమయ్యే లోక జ్ఞానం, భాషా పటిమ, సాంకేతిక మెలకువలు, ఔత్సాహిక నిపుణత తదితరాలు కూడా కావాలన్నారు. ప్రజలూ విద్యా విధానంపై సమగ్రంగా ఆలోచించి తర్కించి.. చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలని వెంకయ్యనాయుడు కోరారు. అప్పుడే విద్యా విధానంలో సముచిత మార్పులు సాధ్యమన్నారు.

Saturday, June 1, 2019

Newzealand beat srilanka by 10 wickets



శ్రీలంకపై కివీస్ అలవోక విజయం
కార్డిఫ్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ నం.3లో శనివారం కివీస్ జట్టు ఆడుతూ పాడుతూ శ్రీలంకపై గెలిచేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కూడా మరో  టీ20 మ్యాచ్ నే తలపించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే అర్ధ సెంచరీ(52 నాటౌట్) మినహా ఏ బ్యాట్స్ మన్ క్రీజ్ లో కుదురుకోలేదు. తిసార పెరీరా (27పరుగులు) మాత్రమే కాస్తంత కెప్టెన్ కు బాసటగా నిలిచాడు. ఫర్గుసన్, మాట్ హెన్నీలు చెరి మూడు వికెట్లు పడగొట్టారు. భారత్ ఉపఖండానికి చెందిన పాక్ జట్టు శుక్రవారం 105 పరుగులకే అలౌట్ కాగా ఈరోజు శ్రీలంక జట్టు కూడా 29.3 ఓవర్లలో 136 పరుగులకే బ్యాట్ ఎత్తేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఎటువంటి తడబాటు లేకుండా కివీస్ ఓపెనర్లు గుప్తిల్(73 నాటౌట్), కొలిన్ మున్రో(58 నాటౌట్) చెరో అర్ధసెంచరీలు కొట్టారు. 16.1 ఓవర్లలోనే 137 పరుగులు చేసి జట్టుకు 10 వికెట్ల విజయాన్ని అందించారు.
ఆసిస్ పై చెప్పుకోదగ్గ స్కోరు చేసిన అఫ్ఘానిస్థాన్ (207 ఆలౌట్)
ఆస్ట్రేలియాతో శనివారం బ్రిస్టోల్ లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ నం.4లో టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ కెప్టెన్ గుల్బుద్దీన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలో అయిదు వికెట్లు త్వరత్వరగా పడిపోయిన నజీబుల్లా జర్దాన్ తో కలిసి గుల్బుద్దీన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ క్రీజ్ నిలిచి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాక బ్యాట్ ఝళిపించారు. ముఖ్యంగా అప్పటికే రెండు వికెట్లు తీసిన స్పినర్ జంపాను నజీబుల్లా ఓ ఆట ఆడుకున్నాడు. అతని ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్ లో ఇదే క్రమంలో ఒక అనవసరమైన షాట్ కొట్టి కెప్టెన్ గుల్బుద్దీన్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. నజీబుల్లా అర్ధ సెంచరీ (51), రహ్మత్ షా 43 పరుగులు, దూకుడుగా ఆడిన రషీద్ ఖాన్ 27 పరుగులు చేసి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు 207 (ఆలౌట్) పరుగులు సాధించేందుకు తోడ్పడ్డారు.

Friday, May 31, 2019

Neither now nor in future nithish sayson possibility of jd(u)joining modi government



భవిష్యత్ లో కూడా మోదీ ప్రభుత్వంలో చేరబోం:సీఎం నితిష్
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఎన్డీయే సర్కార్ కు షాక్ ఇచ్చారు. శుక్రవారం(మే31) ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా చేరబోమని తేల్చి చెప్పేశారు. అయితే ఎన్డీయే మిత్రపక్షంగా తాము కొనసాగుతూనే ఉంటామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వేళ తాము తొలుత తీసుకున్న నిర్ణయమే మున్ముందు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనతాదళ్ (యునైటెడ్) కీలక సంఘం(కోర్ కమిటీ) తీవ్రంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్డీయే పక్షాల ఐక్యతకు చిహ్నంగా కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తాజా కేంద్ర మంత్రివర్గంలో తొలుత జె.డి(యు) చేరాలనుకున్నా తర్వాత పార్టీలో కీలక చర్చల అనంతరం చేరరాదనే తుది నిర్ణయం తీసుకున్నట్లు నితిష్ తెలిపారు. కేవలం ఐక్యతా చిహ్నంగా ఉండేందుకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనుకోవడం లేదన్నారు. బిహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నమాట(బీజేపీతో కలిసి) వాస్తవమేనంటూ ఆయన తమ ప్రభుత్వంలో కచ్చితమైన దామాషాలో భాగస్వామ్య పక్షాలకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు.

Thursday, May 30, 2019

Narendra modi ys jagan sworn-in their respective government head posts



పీఎంగా మోదీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలు గురువారం(మే30) ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయగా ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిల్లో అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రపతి భవన్ లో గురువారం రాత్రి 7గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు 58 మంది లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25మంది కేంద్రమంత్రులుగా, 9 మంది స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయమంత్రులుగా, మరో 24 మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగువారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి సహాయమంత్రిగా ప్రమాణం చేయగా ఆరుగురు మహిళా మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకాసింగ్ సరుతా, దేవశ్రీ చౌదురి మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మనోహర్ జోషి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్  తదితర ప్రముఖులు హాజరైన వారిలో ఉన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ(పశ్చిమబెంగాల్), నవీన్ పట్నాయక్(ఒడిశా), పినరయి విజయన్(కేరళ), వై.ఎస్.జగన్(ఏపీ), కేసీఆర్(తెలంగాణ), అమరీందర్ సింగ్(పంజాబ్), భూపేశ్ భగల్(ఛత్తీస్ గఢ్), కమల్ నాథ్(మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లాట్(రాజస్థాన్)లు హాజరుకాలేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తో గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ఒక్కరే ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తానని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లపై తొలి సంతకం చేసిన జగన్ మొదటి ఏడాది రూ.2250 తర్వాత ఏడాది రూ.2500, ఆపై ఏడాది రూ.2750 చొప్పున అవ్వా,తాతలకు అందిస్తానంటూ ఆ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి రెండో సంతకం చేశారు. ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం లక్షా50వేల గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామన్నారు. వారికి వేతనంగా నెలకు రూ.5వేలు చెల్లిస్తామని వారికి మెరుగైన ఉపాధి లభించే వరకు వాలంటీర్లగా కొనసాగుతారన్నారు. రాష్ట్రంలో యువతకు మొత్తం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ వివరించారు.