Saturday, May 18, 2019

Vande bharat express completes 1 lakh km


లక్ష కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న `వందే భారత్`
న్యూఢిల్లీ-వారణాసిల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయంగా నిర్మితమైన ఈ హైస్పీడ్ రైలు ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు ప్రత్యామ్నాయంగా వందే భారత్ పేరిట ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మధ్య వారానికి  అయిదు రోజులు ప్రయాణిస్తోంది. తొలిరోజు తిరుగు ప్రయాణంలో మాత్రం కాన్పూర్ వద్ద స్వల్ప అంతరాయంతో కొద్ది సేపు నిలిచిపోవడం మినహా ఇప్పటి వరకు వందే భారత్ సజావుగా ప్రయాణం సాగిస్తోంది. చెన్నై లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ.సి.ఎఫ్) నుంచి రెండో దశలో రూపుదిద్దుకున్న ఈ రైలు కోచ్ లు మే నెలాఖరుకు ఢిల్లీ చేరనున్నాయి. తొలిదశ కోచ్ లలో కనిపించిన లోటుపాట్లను సరిచేసి మరిన్ని సౌకర్యాలతో కొత్త కోచ్ లను సిద్ధం చేశారు.  ఈ రైలూ ఢిల్లీ-వారణాసి మధ్యే పరుగులు తీయనుంది. తర్వాత దశల వారీగా అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్ ప్రయాణించనుంది.

4 militants killed in encounter with security forces in J-K's Pulwama baramulla dist



కశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత
కశ్మీర్ లో భద్రతా బలగాలు శనివారం (మే18) వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చివేశాయి. ఈ ఎదురు కాల్పులు పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని పంజ్గామ్ ప్రాంతంలోని అవంతిపొరలో తెల్లవారుజామున సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులకు దిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్.టి)గ్రూపునకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమర్చాయి. పహారా కాస్తున్న భద్రత దళాలకు ఉగ్రవాదుల ఉనికి తెలిసింది. దాంతో వారు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ ముగ్గురికి పలు ఉగ్ర కార్యకలాపాలతో సంబంధముంది. తాజా ఎన్ కౌంటర్ లో ప్రాణాలు విడిచిన ముగ్గురు పుల్వామా జిల్లాకే చెందిన షౌకత్ దార్, ఇర్ఫాన్ వార్, ముజఫర్ షేక్ లుగా గుర్తించారు. వీరు ప్రధానంగా పౌర ఆవాసాలు, భద్రతా బలగాలపై దాడులకే ప్రత్యేకించి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది జవాన్ ఔరంగజేబు హత్యతో దార్ కు సంబంధముందన్నారు. ఇదే ప్రాంతంలోని దలిపొరలో గురువారం ఓ ఇంట్లో దాగిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు పొగొట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా శనివారం ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కనుగొని కాల్చివేయడంతో ఆపరేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.  మరో వైపు బారాముల్లా జిల్లాలోని సొపొర్ పట్టణంలో హిజ్బుల్ గ్రూప్ నకే చెందిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఈ ఉదయం సోదాలు నిర్వహిస్తూ ఎన్ కౌంటర్ చేశాయి.

Friday, May 17, 2019

naidu step ups kejriwal yechuri to meet rahul mayawati akilesh before may23


రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో నేతలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం(మే17) ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ 19న జరగనుండగా ఫలితాలు 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. మే23న మిత్రపక్షాలు,  కాంగ్రెస్ తో కలిసి వచ్చే అవకాశం ఉన్న పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. అంతకు వారం ముందుగానే చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో మరోసారి కీలకపాత్ర పోషించడానికి ఉద్యుక్తులయ్యారు. శుక్రవారం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకుని చర్చలు జరిపారు. శనివారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. తర్వాత లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయవతి, సమాజ్ వాది పార్టీ అధినాయకుడు అఖిలేశ్ యాదవ్ లను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ టీఆర్ఎస్ సహా భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే అన్ని పక్షాలను తమ కూటమిలోకి స్వాగతిస్తామన్నారు. ఢిల్లీ చేరగానే తొలుత ఆయన ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలతో పాటుగా 50 శాతం వీవీప్యాట్ ల్ని లెక్కించాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాల తీరు ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో కొనసాగిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. రీపోలింగ్ తదితర చాలా అంశాల్లో స్థానిక అధికారుల తీరు వివాదాస్పదమయిందన్నారు. ముఖ్యంగా ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో 38 రోజుల తర్వాత 5 కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టనుండడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వై.ఎస్.ఆర్.సి.పి. సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోరగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్ణయాన్ని ఇటీవల వెల్లడించింది. తొలివిడత ఏప్రిల్11నే ఇక్కడ ఎన్నిక పూర్తవ్వగా ఎన్నికల మలిదశ మే19న రీపోలింగ్ తలపెట్టడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Two Indian climbers dead, Irishman missing in Nepal's Himalayas

హిమాలయాల్లో ఇద్దరు భారత పర్వతారోహకుల మృతి..ఆచూకీ లేని ఐర్లాండ్ వాసి
హిమాలయ పర్వతారోహక బృందంలోని ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఒక ఐర్లాండ్ జాతీయుడి ఆచూకీ తెలియరావడం లేదు. శుక్రవారం(మే17) అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ నెలలో మృతి చెందిన పర్వతారోహకుల సంఖ్య ఆరుకు చేరింది. నేపాల్ మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో ఒకటైన మకాలు పర్వతారోహణకు వెళ్లిన న్యూఢిల్లీకి చెందిన రవి ఠకర్(27), నారాయణ్ సింగ్(34) మృతి చెందగా డబ్లిన్ లో టీచరయిన సీమస్ సీన్ లాలెస్(39) జాడ తెలియడం లేదు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఏజెన్సీకి చెందిన థానేశ్వర్ గుర్గాయిన్ అందించిన వివరాల ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ సౌత్ కోల్(శిఖర లోయ) శిబిరంలోనే ప్రాణాలు కోల్పోయిన రవి ఠకర్ ను కనుగొన్నారు. అయితే అతని మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అననుకూల వాతావరణం కారణంగానే అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మకాలు నుంచి తిరుగు ప్రయాణంలో నారాయణ్ సింగ్ అస్వస్థతకు గురై గురువారం మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి మిరా ఆచార్య తెలిపారు. అతను ఉత్తరాఖండ్ కు చెందిన సైనికుడని తెలుస్తోంది. సాహసయాత్రలో ఉండగా గురువారం సీమస్ కాలు జారి మంచులోయలోకి పడిపోయినట్లు సమాచారం.