Sunday, April 28, 2019

10 dead 25 injured in Himachal bus accident


హిమాచల్ బస్ ప్రమాదంలో 10 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో శనివారం(ఏప్రిల్27) రాత్రి జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10 దుర్మరణం చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో ప్రయివేటు బస్ దల్హౌసి- పటాన్ కోట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపుతప్పి 200 అడుగుల లోయలోకి జారిపోయింది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నట్లు ఎస్.పి. మోనికా భూటాన్గురు తెలిపారు. దల్హౌసి కంటోన్మెంట్ కు చెందిన ఆర్మీ సహాయక బృందాలు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారందర్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఆర్మీ వెంటనే రంగంలోకి దిగడంతో మృతుల సంఖ్య మరింత పెరగకుండా నివారించగల్గినట్లు కల్నల్ ఆనంద్ చెప్పారు. ఘటనపై రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Saturday, April 27, 2019

returning officer asks police to register fir against gambir for holding rally without permission


గౌతం గంభీర్ పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం
తాజాగా రాజకీయ నాయకుడి అవతారంలోకి మారిన క్రికెటర్ గౌతం గంభీర్ అప్పుడే కేసుల్లో చిక్కుకుంటున్నాడు. ఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంభీర్ అనుమతి లేకుండా జంగ్పూర్ లో గురువారం (ఏప్రిల్ 25) ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొన్నాడు. పెద్ద ఎత్తున రోడ్ షో కూడా నిర్వహించాడు. దాంతో రిటర్నింగ్ ఆఫీసర్ కె.మహేశ్ బీజేపీ అభ్యర్థి గంభీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి అతిశ్ లతో గంభీర్ పోటీపడుతున్నాడు. గంభీర్ కు ఓటర్ల జాబితాలో రెండు చోట్ల ఓట్లున్నట్లు కూడా ఆప్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు.

a show of brother sister love and exchange of banter as rahul priyanka cross paths at kanpur airport


రాహుల్ ప్రియాంకల ఆనందహేల
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బిజిబిజీగా తిరుగుతున్నారు. అనుకోకుండా శనివారం (ఏప్రిల్27) అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కాన్పూర్ విమానాశ్రయంలో కలిశారు. ఎవరి ప్రచార సభలకు వారు వెళ్తున్న సమయంలో వీరిద్దరూ ఎదురుపడ్డంతో ఇలా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రియాంక కాన్పూర్ విమానాశ్రయానికి వస్తున్నారని తెలిసి అప్పటికే అక్కడ ఉన్న రాహుల్ సోదరిని పలకరించడానికి ఎదురెళ్లారు. అన్నను చూడగానే ఉబ్బితబ్బిబైన ప్రియాంక ఒక్క ఉదుటన రాహుల్ చెంతకు చేరి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ‘ఎన్నిక ల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నాను నీ మంచి సోదరుడికి ఇచ్చే విమానం ఇదేనా’ అని సరదాగా ప్రియాంకతో జోక్ చేశారు. అందుకు స్పందించిన ప్రియాంక అన్న భుజాలపై చేతుల వేసి నవ్వులు చిందించారు. ప్రియాంక ప్రయాణిస్తున్న విమానాలతో పోలిస్తే వాస్తవానికి రాహుల్ ప్రచారానికి వెళ్తున్న విమానాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాల్గో దశలో అమేథి, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి ఈ రోజు ఆఖరు కావడంతో శనివారం అమేథి ఎన్నికల ప్రచారానికి వెళ్తూ రాహుల్ కాన్పూర్ విమానాశ్రయానికి వచ్చారు. ప్రియాంక బారబంకి, ఉన్నవ్ రోడ్ షోలకు వెళ్తూ ఇక్కడకు వచ్చారు. 

cong lashes out at shah for Ilu-Ilu comment


అమిత్ షా ‘ఇలు ఇలు’ కామెంట్లపై కాంగ్రెస్ ధ్వజం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చేసిన ఇలు ఇలు కామెంట్ల పై ఆ పార్టీ ధ్వజమెత్తింది. అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్26) జలోర్ లో ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ కు ఉగ్రవాదులతో ఇలు ఇలు (ఐ లవ్ యూ  ప్రాచుర్యం పొందిన హిందీ సినిమా పాట) సంబంధముందంటూ వ్యాఖ్యలు చేశారు. 1999లో బీజేపీయే జైల్లోని ఉగ్రవాదుల్ని కాందహార్ కు తీసుకెళ్లి మరీ అప్పగించిందని గుర్తు చేస్తూ అమిత్ షాపై రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అవినాశ్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్ఘానిస్థాన్ కు విమానాన్ని హైజాక్ చేసుకుని వెళ్లి ఉగ్రవాదులు డిమాండ్ చేయడంతో నాటి ఎన్డీయే ప్రభుత్వం వాళ్లు కోరిన విధంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మసూద్ అజర్ సహా ముగ్గురు కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. బీజేపీలోని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు లేదా వారి కుటుంబసభ్యులు ఎవరైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారా? అని ప్రశ్నించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం బలహీన పరుస్తోందన్నారు. సోషల్ మీడియాను వారు దుర్వినియోగం చేస్తున్నారని అవినాశ్ ఆరోపించారు. మరో 50 ఏళ్లు దేశాన్ని తామే పరిపాలిస్తామని మోదీ, అమిత్ షాలు గతంలో పేర్కొన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాజ్యాంగం ఎంతటి ప్రమాదంలో పడిందో గమనించాలని ప్రజల్ని కోరారు.